Saturday, November 22, 2014

Monday, January 13, 2014

అలనాటి తెలుగు చందమామ బ్లాగు మూసివేత

అలనాటి తెలుగు చందమామ బ్లాగును ఈ రోజునుండి మూసివేయటం జరిగింది. ఈ బ్లాగు 2009 లో ఎంతో ఉత్సాహంగా చందమామ అభిమానులను కొంతమందిని కూడగట్టుకుని ప్రారంభించబడింది. ఆరేడు నెలలు "ఆంధ్రులు ఆరంభ శూరులు" చందాన బాగానే జరిగింది. మెల్లి మెల్లిగా ఉత్సాహం అడుగంటి వ్యాసాలూ తగ్గిపొయ్యాయి. ఈ బ్లాగులో ఉన్న వ్యాసాలూ అన్నీ కూడా నా మొదటి బ్లాగు "సాహిత్య అభిమాని" కి తరలించాను. ఆసక్తి ఉన్నవారు ఆ బ్లాగులో సందర్శించి చూడగలరు. 

ఈ బ్లాగును జరిగినంత కాలం విజయవంతంగా జరగటానికి పాటుబడిన  అందరికీ ధన్యవాదాలు. ఈ బ్లాగులో నాతోపాటు సహా రచయితలుగా ఉన్న వారు:

Saturday, October 5, 2013

ఎంత వెతికితే అంత-ప్రయత్నించి చూడండి




పాత తెలుగు చందమామ పుస్తకాల సేకరణ అనేది అలనాడు తెలుగు చందమామ చదివి ఆ కాపీలు దాచుకోలేని అందరూ చేస్తున్న పని. ఈ విషయంలో అలా సేకరించదలుచుకునే వారికి ఒక శుభవార్త. 1947 నుంచి 2000 వరకూ కూడ చందమామలు పి డి ఎఫ్ ఫార్మాట్ లో ఇంటర్నెట్లో డొన్లోడ్  కు దొరుకుతున్నాయి. ఎక్కడ!? కొద్దిగా గూగులు, ఇంకా అలాంటివే మరికొన్ని గనులు వెతుక్కోగలిగిన ఓపిక కలవారికి దొరకకపోతే ఆశ్చర్యపోవాలి. ప్రయత్నించి చూడండి. 

ఎంత వెతికితే అంతటి పాత బంగారం దొరుకుతూనే ఉన్నది. ప్రయత్నం చెయ్యాలి అంతే!



Sunday, July 14, 2013

చందమామ ప్రియుల బృందం




చం పి (అంటే  చందమామ పిచ్చోళ్ళ) కార్యక్రమాలు మంచి ఉధృతంగా ఉన్న2009లో,  ఆంద్రుల ఆరంభ శూరత్వానికి ప్రతీకగా చందమామ ప్రియులు యాహూ గ్రూప్ స్థాపించటంజరిగింది. బృందం ముఖ్య  ఉద్దేశ్యం,   అలనాటి చందమామ,  అంటే  1960 నుంచి 1980 వరకు కొడవటిగంటి కుటుంబ రావుగారు సంపాదకులుగా ఉన్న బంగారు కాలానికి  సంబంధించిన జ్ఞాపకాలు, చందమామ ప్రతులు గురించి చర్చ, వీలైన చోట పాత చందమామ ప్రతులు ఇచ్చి పుచ్చుకోవటం (ఇది జరిగే పనేనా), లేదా ఇప్పుడు పి  డి  ఎఫ్ లు (ఇప్పుడు బాగానే దొరుగుతున్నాయి కాని అప్పట్లో అవొక అపురూప అందని ద్రాక్ష పళ్ళు) పంచుకోవటం వంటి కార్యక్రమాలు. 

మొదట్లో చెప్పినట్టుగానే ఆరంభ శూరత్వమే కాని,  ఆ బృందం పని పెద్దగా జరుగలేదు. ఈలోగా ఒక ఉత్పాతం జరిగింది. నాకు యాహూ మెయిలులో చెత్త మైళ్ళు రావటం ఎక్కువయ్యి, చీకాకు పుట్టి ఒకానొక రోజున యాహూ మెయిలు పూర్తిగా తొలగించాను. తరువాత్తరువాత  ఎవరన్నా ఆ బృందంలో సభ్యత్వానికి నాకు మెయిలు పంపిస్తే,  అవి అనుమతించటానికి వీల్లేక పాపం వాళ్ళందరికీ, దాదాపు ఒక డజను మంది దాకా ఉన్నారు, ఉన్న విషయం చెప్పి ఊరుకున్నాను. 

కాని,  నిన్న ఒకాయన నాకు మెయిలు పంపారు, తనకు ఈ బృందం లో సభ్యత్వం కావాలని. ఆయన చెప్పిన మాటాలు, సభ్యత్వానికి ఆయన చూపిన ఉత్సాహం చూసి, మరొకసారి ప్రయత్నిద్దాం అని చూస్తె, సభ్యత్వ అభ్యర్ధనలు ఎలాగో నాకు జి మెయిలులో వస్తున్నాయి. సరే యాహూలో మరొక మెయిలు సృష్టించి బృందాన్ని పునరుధ్ధరించటానికి ప్రయత్నించాను. అనూహ్యంగా ప్రయత్నం ఫలించింది. 

ఇప్పుడు చందమామ అభిమానులకు విన్నవించేది ఏమంటే, ఆసక్తి ఉన్న వారు ఈ కింది లింకు నొక్కి ఈ చందమామ ప్రియులు బృందంలో సభ్యులుగా  చేరవచ్చు, వారి వారి జ్ఞాపకాలు, చందమామకు సంబధించిన సమీక్షలు వ్రాయవచ్చు, లేదా వారి వద్ద ఉన్న చందమామ ప్రతులు అందరితో పంచుకోవచ్చు (చదివి ఇచ్చేస్తామండీ  నిఝం). 


చందమామ ప్రియులు 

పాత చందమామలు ఇచ్చి పుచ్చుకోవటానికి అందరికీ సాధ్యపడని విషయం చివరకు చందమామ గురించి చర్చ చేద్దామని కూడా బృంద సభ్యులకు అనిపించటంలేదు. పోనీ ఎవరన్నా ఒక్క సమీక్ష వ్రాస్తారేమో అని చూసినా స్పందన లేదు. ఇంక ఈ చందమామ అభిమానుల బృందం దేనికి. కాబట్టి, తొలగించాను. తప్పలేదు, ఉత్సాహం లేని బృందం లేకపోతేనే మంచిది అని నా అభిప్రాయం. 

Friday, April 26, 2013

ఒక శుభవార్త



తెలుగు చందమామ అభిమానులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ విసుగు చెందని విక్రమార్కుల లాగ  (1947 నుంచి 1980 వరకు) అలనాటి చందమామలు కాని, అప్పటి ధారావాహికలుగాని ఎక్కడన్నా దొరుకుతాయా అని వెతుకుతున్న వారికి ఇదొక శుభవార్త.


ఈ రోజున, చూద్దాం ఎక్కడన్నా దొరుకుతాయేమో అని చందామామ సీరియల్స్ ఇన్ ఇ పబ్ (పి డి ఎఫ్ లాగ ఇదొక డాక్యుమెంట్) అని గూగులమ్మని అడిగాను( ఈ మధ్య ముంబాయి వచ్చిన తరువాత ప్రయాణంలో ఐ పాడ్ లో "ఇ పబ్"{epub} పుస్తకాలు చదవటం మంచి కాలక్షేపం గా ఊన్నది). ఎప్పటికీ విసుగు చెందని గూగులమ్మ, వెంటనే కమ్మటి వార్త చెప్పింది.  

ఇంటర్నెట్ ఆర్ఖైవ్ వెబ్ సైటులో మనకు చిరపరిచితమైన అలనాటి చందమామ ధారావాహికలు కొన్ని అప్లోడ్ చేశారు అన్న విషయం తెలిసింది.  అంతే  కాదు అనేక రకాల ఫార్మాట్లల్లో ఉన్నాయి డౌన్లోడ్ కూడా  చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ చదువుకోనూ వచ్చను. 

ఎక్కడనుంచి,  ఎలా అంటే, ఈ కింది లింకు నొక్కి వచ్చిన సమాచారం ప్రకారం మీకు కావలిసినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు:



పాత చందమామల డౌన్లోడ్ల విషయంలో యులిబ్ డాట్ ఆర్గ్ కానివ్వండి మరొక వెబ్సైటు కాని  మునుపు,  చందమామ అభిమానులకు ఎదురైన అనుభవం రీత్యా, ఇప్పుడు ఈ ఫైళ్ళు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోవటం లో తప్పు లేదు కదా.   కాబట్టి ఆలస్యం దేనికి దారితీస్తుందో అభిమానులకు తెలియనిది కాదు. 

కొసమెరుపు:
చివరగా నేను ఎంతో ఆశగా ఐ పాడ్లో ఇ పబ్ ఫార్మాట్లో హాయిగా పుస్తకం తిరగేస్తున్నట్టుగా చదువుదామని డౌన్లోడ్ చేస్తే, ఈ ఫైళ్ళు ఎలా చేశారో కాని తెలుగు స్క్రిప్ట్ కనపడటం లేదు.బొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇ పబ్ ఫార్మాట్లో తెలుగు లిపి కనపడుట  లేదు.ఇది కొంత నిరాశ అయినా, పిడి ఎఫ్ గా చదువుకోవటానికి   బాగానే ఉన్నది. 
 
**********************************
కాబట్టి, ప్రస్తుతానికి పిడిఎఫ్ ఫార్మాట్ లోనే డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఐ పాడ్లో చదువుకుందామనుకునే వారికి ఒక చిట్కా! సామాన్యంగా ఐపాడ్లో ఉండే "ఐ బుక్స్" లో కాకుండా "కోబో" డౌన్లోడ్ చేసుకుని  ఆందులో,  ఈ పిడిఎఫ్ లు చదువుకుంటూ ఉంటే,  చక్కగా పేజీలు  చేత్తో తిప్పినట్టుగా తిరుగుతూ, అచ్చం మన చేతిలో చందమామ పుస్తకమే ఉన్నదన్న భావన కలుగుతున్నది. ప్రయత్నించి చూడండి.
**********************************

Wednesday, October 31, 2012

త్రిశంకు స్వర్గం

    పై బొమ్మ చందమామ పత్రిక వారి సౌజన్యం    
త్రిశంకు స్వర్గం ఏర్పాటు గురించిన కథ అందరికీ తెలిసినదే. కాని ఆ స్వర్గం కాని స్వర్గం ఏర్పాటు దృశ్యం ఇంతవరకూ ఏ చిత్రకారుడూ చిత్రించినట్టు  నాకు తెలియదు. మనందరికీ తెలిసిన అద్భుత చిత్రకారుడు శ్రీ వడ్డాది పాపయ్య గారు చిత్రించిన బొమ్మ ఇది. దేవీ భాగవతం ధారావాహికగా వస్తున్నా రోజుల్లో మాట. మూడు దశాబ్దాల  పైగా కాలం నడిచిపోయింది! ఎన్నాళ్ళయినా ఆ పురాణ ఘట్టాన్ని  బాగా చిత్రించ గలవారు వడ్డాది పాపయ్య గారొక్కరే.




మునుపు ఈ బ్లాగులో ప్రచురించిన వ్యాసం సెప్టెంబరు 2011లో. మళ్ళీ సంవత్సరం పైన  నెల తరువాత మరొక వ్రాత ఈ బ్లాగులో ఇప్పుడే. ఇన్నాళ్ళు ఏ విధమైన కొత్త వ్యాసాలూ వ్రాయకపోయినా బ్లాగును తీసేయ్యకుండా ఉంచిన బ్లాగర్ డాట్ కాం వారికి కృతజ్ఞతలు ఈ బ్లాగు బృందంగా ఏర్పడి నడపబడుతున్నది. కొత్తల్లో బృంద సభ్యులు సహజంగా ఉత్సాహంగా ఆధ్రులం కాబట్టి ఆరంభ శూరత్వం చూపాము కాని రాను రాను ఉత్సాహం నశించినట్టుగా ఉన్నది.  ఈ ఉత్సాహం తగ్గటం గురించి బృంద సభ్యులందరూ ఆలోచించగలరు.

అలనాటి చందమామ  అభిమానం ఉన్నవారు ఎవరైనా సరే ఉత్సాహంగా వ్యాసాలూ, సమీక్షలు తరచూ వ్రాయగాలవారిని బృందం లోకి ఇదే ఆహ్వానం. అలనాటి చందమామ అభిమానులు తప్పక స్పందించగలరు.






Monday, September 12, 2011

విచిత్ర కవలలు - శ్రీ సురేఖ సమీక్ష

ఈ బ్లాగు పేరు మార్చినాక వచ్చిన మొట్టమొదటి వ్యాసం. ఈ వ్యాసాన్ని, "అలనాటి చందమామ" వీరాభిమాని శ్రీ సురేఖ గారు వ్రాయటం ముదావహం.

పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి ప్రచురించుకోవటం, చందామా డౌన్ హిల్ ప్రయాణం మొదలయ్యిన మొదటి రోజుల్లో వచ్చిన పున:ప్రచురణ గురించి శ్రీ మట్టెగుంట అప్పారావుగారు (సురేఖ) పాత కొత్త బొమ్మలను కూడ ప్రచురించి చాలా చక్కగా విశ్లేషించారు.


1952 లో అనుకుంటాను ( ఏమంటే నా దగ్గర 1953 నుండే చందమామలు
వున్నాయి ) విచిత్రకవలలు సీరియల్ చందమామలో వచ్చేది. అప్పుడు నా
వయసు 11 ఏళ్ళు. ఐనా ప్రతినెలా చందమామలోని ఆ కధ చదవడానికి
ఆతృతగా అక్కా, నేనూ ఎదురు చూసేవాళ్లం. ఆ కధలోని రాక్షసులు, బారెడు
గెడ్డంతో వుండే పొట్టివాడు, ఇలా ప్రతిదీ మమ్మల్ని , మాలాగే వేలాది మందిని
చందమామ ప్రియులుగా చేశారు. ఆ "విచిత్రకవలలు" కధకు కీ"శే" చిత్రా
అద్భుతమైన చిత్రాలు గీశారు.

1974 జూలైలో విచిత్రకవలలు చిత్రాగారి రంగుల బొమ్మలతో తిరిగి
మొదలయింది. పతాక శీర్షికకు బొమ్మను మార్చటమే కాకుండా ప్రతి
బొమ్మను చిత్ర మరింత అందంగాతిరిగి వేశారు. ప్రతి నెలా పతాక శీర్షిక
బొమ్మను ఆ నెల కధానుగుణంగా మార్చి వేశేవారు. పై బొమ్మను ఈ
బొమ్మను చూస్తే మీకు తేడా తెలుస్తుంది.

కవలలను రాక్షసుడు గ్రద్ద రూఫంలో వచ్చితన్నుకు పోయే దృశ్యాల్ని
గతంలో ప్రచురించిన బొమ్మల్ని మీరు ఇక్కడ చూడొచ్చు

అదే దృశ్యాన్ని దాదాపు ఇరవైఏళ్ళ తరువాత రంగుల్లో చిత్రా వేసిన
బొమ్మను చూడండి !! ఏదీ ఈనాటి చందమామకు ఆ వెన్నెల వెలుగు?!

1955 జూలైలో "విచిత్రకవలలు" కధను చందమామ పబ్లికేషన్స్ వారు
పుస్తక రూపంలో ప్రచురించారు. ఈ కధ ఎంత విచిత్రంగా వుంటుందో
అలానే అప్పుడు ఈ పుస్తకం ఖరీదు ఓ రూపాయి అంటే ఇప్పుడు విచిత్రంగా
వుంటుంది. ముఖచిత్రాన్ని మాత్రం చిత్రా కాకుండా గోపి అనె చిత్రకారుడు
వేయడం మరో విచిత్రం! ఈ అపురూప పుస్తకం నా దగ్గర వుంది. ఎందు
కంటే " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి మీకిప్పుడు పుస్తకాల
షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి !! నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ
ఇవ్వను ! అవిప్పుడు నాకెక్కడా దొరకవు కాబట్టి !! "

Monday, August 1, 2011

బ్లాగు పేరు మార్పు

మన తెలుగు చందమామ బ్లాగ్ పేరును అలనాటి చందమామగా మార్చటమైనది. గమనించ గలరు . కొన్ని రోజుల తరువాత బ్లాగు కింది లింక్ ద్వారా చూడవచ్చు.



అలనాటి తెలుగు చందమామ


Sunday, June 12, 2011

మాయదారి ముసలిది బొమ్మలు

మిత్రుడు మన తెలుగు చందమామ సహా రచయిత శ్రీ రాధేశ్యాం రోజున ఇద్దరు మోసగత్తెలు అన్నపేరుతొ ఒక చక్కటి సమీక్ష వ్రాసారు. ఆయన వ్రాసినది మూడవసారి ధారావాహికప్రచురించినప్పటిది అనుకుంటాను. ఇదే కథ తెలుగు చందమామలో మూడుసార్లుప్రచురించబడినది. రెండవసారి వ్రాసినప్పుడు రచయిత శ్రీ ఆర్ నాగభూషణం గారు.

ఈ ధారావాహికకు పట్టు చిత్రాగారు వేసిన బొమ్మలు. అన్ని బొమ్మలూ ఒక్కటొక్కటిగా ఉంచటం కష్టం కాబట్టి. మూడు విడతలుగా తయారు చేసి ఉంచాను. ఆసక్తి కలవారు ఒక్కో బొమ్మను నొక్కి అన్ని బొమ్మలను చూడవచ్చు.










వపాగారు వేసిన చిత్రా చిత్రం

అపురూప చిత్రకారుడు శ్రీ చిత్రా
తెలుగు చందమామకు అంత పేరు తెచ్చిపెట్టినది ఎవరు? కథా రచయితలా, సంపాదకులా, చిత్రకారులా. మనం మంచి తనంగా, "అందరూ" అని అన్నాకూడా, నిజానికి కొత్తవారిని ఆకర్షించి చందమామను చూసేట్టుగా చేసినది మొదట పుస్తకంలోని బొమ్మలే కదా. చూడటం అంటూ జరిగితే కదా పుస్తకంలో ఏమున్నది అని తరచి చూసేది. అసలు పుస్తకానికి బాహ్య రూపం బొమ్మలే.

తెలుగు చందమామ స్వర్ణ యుగంలో అద్భుత చిత్రకారులు వడ్డాది పాపయ్య గారు అట్ట మీద బొమ్మ, చివరి అట్ట మీద బొమ్మ, లోపల కొన్ని ధారావాహికలకు బొమ్మలు వేస్తె, లోపల ఉన్న ముఖ్య ధారావాహికకు బొమ్మలు వేసి ప్రాణం పోసేది "చిత్రా" గా పేరొందిన శ్రీ టి వి వీర రాఘవులు గారు . ఆయన గురించి ఇంటర్నెట్ లో వ్రాయబడిన మొట్టమొదటి వ్యాసం కింది లింకు నొక్కి చూడవచ్చు



ఇప్పటికి కూడా చందమామ పేరుతొ బతుకీడుస్తున్న పత్రికలో బొమ్మలు వేస్తున్న శంకర్ గారు పురాణ పాత్రలకు ప్రాణం పోసేవారు.

ఒకే పత్రికలో పనిచేస్తున్న ముగ్గురు అద్భుత చిత్రకారులు పోటాపోటీగా బొమ్మలు వేసి పిల్లలను పెద్దలను అలరించి, కొడవటిగంటి సంపాదకీయంలో వచ్చిన కథలకు ప్రాణం పోసి దశాబ్దాలపాటు పిల్లల మానసిక పరిణతికి పాటుపడినది అలనాటి చందమామ.

చిత్రాగారు ముందుగా వెళ్ళిపోయారు, చందమామలో ధారావాహికల వన్నె తగ్గిపోయింది. మళ్ళి పాత దారావాహికలనే మళ్ళి మళ్ళి వేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. చిత్రా వంటి చిత్రకారుడు చందమామకు దొరకనేలేదు.


అలా అందరికంటే ముందుగా వెళ్ళిపోయినా తోటి చిత్రకారుడు శ్రీ చిత్రా గారి బొమ్మను వడ్డాది పాపయ్య గారు  చిత్రించి యువ పత్రికలో అట్ట మీద ప్రచురింపచేసారు అన్న విషయం మధ్యవరకూ తెలియదు . చందమామ అభిమానులందరినీ అలరించే అద్భుతాన్ని చూడండి .

వపా వేసిన చిత్రా చిత్రం
పై చిత్రం సేకరణ శ్రీ సత్యం, మనకు అందించిన వారు శ్రీ శ్యాం నారాయణ
తాను వేసిన తోటి చిత్రకారుని బొమ్మకు  చక్కటి వ్యాఖ్య వ్రాశారు శ్రీ వపా. పిన్నలకూ పెద్దలకూ "ఇష్టంగా " బొమ్మలను "చదవడం " నేర్పిన చిత్రాగారు. నిజమే, చిత్రాగారి బొమ్మలు చూస్తే చాలు, కథ చదవాల్సిన పనే లేదు. కథ మొత్తం అర్ధం అయిపోతుంది మరి.
చిత్రాగారి మరికొన్ని అరుదైన చిత్రాలు

కుడిపక్కన శ్రీ చిత్రా,  మధ్యలో ఆయన  తోటి చిత్రకారుడు శ్రీ శంకర్ గారు,   పూర్తిగా ఎడమపక్కన మూడవ వ్యక్తీ ఎవరో  తెలియదు   
చిత్రాగారి క్లోజప్
 చిత్రాగారు చందమామ సిబ్బందితో కూర్చున్న వారిలో చిత్రాగారి పక్క శ్రీ ముద్దా విశ్వనాథం గారు అనుకుంటాను 
చందమామ అపురూప చిత్రకారులు శ్రీ శంకర్, శ్రీ చిత్రా
పైనున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను మనకు అందచేసిన వారు శ్రీ రాజశేఖర రాజు






































 

ఇద్దరు మోసగత్తెలు - చందమామ మినీ సీరియల్

అరేబియా కధల పరంపరలో భాగంగా ముందొక బ్లాగులో వ్రాసిన 'గంధర్వ చక్రవర్తి కూతురు' మినీ సీరియల్ లాగే దాని కన్నా ముందు వచ్చిన సీరియల్ " ఇద్దరు మోసగత్తెలు". చాలామట్టుకు పోగా నా దగ్గర ఇంకా మిగిలి వున్న చందమామ సీరియల్స్ పుస్తకాలలో ఇది ఒకటి. రచయిత ఎవరో తెలియదు. తొమ్మిది భాగాలలో ఎన్నో మలుపులతో చాలా పకడ్బందీగా పట్టుగా నడుస్తుంది కథ.




ఖలీఫా
గారి పావురాలటపా నడుపుతున్న వ్యక్తి మరణానంతరం టపానీ నీగ్రోబానిసలనీ, దివాణంతో సహా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అతని భార్య దిలైలా, కూతురు జీనాబ్ లే మన కథానాయికలు. దిలైలా పావురాలటపా తాను నిర్వహించగలనని వుద్యోగం తనకిప్పించామనీ అర్జీ పెట్టుకున్నా అది బుట్టదాఖలౌతుంది. తీరాచూస్తే టపా నిర్వహణ పూర్వాశ్రమంలో గజదొంగలుగా బాగ్దాదు నగరాన్ని హడలెత్తించి ప్రస్తుతం కొత్వాళ్లుగా పనిచేస్తున్న అహ్మద్, హసన్ లకు అప్పగించ బడుతుంది. దొంగలుగా వాళ్ళని పట్టుకోలేక వాళ్ళని కొత్వాళ్లుగా కొలువులో ఉంచుకుంటాడు ఖలీఫా.


దానితో భగ్గుమన్న దిలైలా..దొంగలకీ, మోసగాళ్ళకీ ఉద్యోగాలిచ్చేట్టయితే మన ప్రతాపం కూడా నగరానికి మరీ ముఖ్యంగా కొత్వాలుకి తెలిసోచ్చేలా చెయ్యాలని బయలుదేరుతుంది. అదిమొదలు ఆమె చేసే మోసాలు..దొంగతనాలూ..నగరాన్ని హడాలెత్తిస్తాయి. ఒకదానికి కొనసాగింపుగా మరొకటీ దానికి తోడుగా ఇంకొకటీ..దానికి తగ్గట్టు ఆవిడ వేసుకొనే వేషాలూ..మనల్ని ఆపకుండా చదివిస్తుంది.


మొదటగా ఒక రక్షక భట నాయకుడి భార్యకి పిల్లలు కలిగే మార్గం చెప్పే ఒక సాధువు దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి పెళ్ళికోసం ఎదురుచూస్తున్న ఒక వర్తకుడి దగ్గరకి తీసుకెళ్తుంది. ఆమెని చూపించి నీకు పెళ్లిచేస్తాని చెప్పి వెయ్యి వరహాలు నొక్కేస్తుంది. యువకుడిని గదిలో ఒంటరిగా కూర్చోపెట్టి ఇతడే సాధువని చెప్పి నగలు తీసి ఒంటరిగా వెళ్ళమంటుంది. నగలు దాచేస్తుంది. ఒక కలంకారీ వ్యాపారి వద్దకు వెళ్లి, వీళ్ళిద్దరూ తనపిల్లలనీ కొత్త ఇంటికోసం చూస్తున్నాననీ అడిగితే, ఖాళీగా వున్న వాళ్ళ ఇంటి తాళాలు ఇస్తాడు. అతని కన్ను చాటుచేసి... కొట్లో వున్న సామానంతా దాటించేస్తుంది.





ఇలా సీరియల్ లాగా సాగుతాయి ఆమె మోసాలు. మొత్తానికి దిలైలా ఇల్లుచేరింతరువాత..ఇక కూతురు జీనాబ్ మొదలెడుతుంది. తమను పట్టుకోవటానికి ఖలీఫా చేత నియోగించబడిన అహ్మద్, అతని భటులనీ మోసం చేసి ఒంటిమీది బనియన్, చెడ్డీ తప్ప మిగతాదంతా ఊడ్చేస్తుంది. ఇంకో కొత్వాలు హసన్ ద్వారా వీరిద్దరూ మోసాలు ఎందుకు చేస్తున్నారో తెలుసుకొన్న ఖలీఫా పావురాల టపాకు సంబంధించిన దివాణాన్ని మళ్ళీ దిలైలా పరం చేస్తాడు.







అయితే తనకు జరిగిన అవమానం మర్చిపోలేని అహ్మద్ తన శిష్యుడైన పాదరసం అలీ ని బాగ్దాదుకు రప్పించి తల్లీ కూతుళ్ళ మీదకి పంపిస్తాడు. జీనాబ్ వాడిని కూడా చిత్తు చెయ్యడంతో పాదరసం ఆలి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి జీనాబ్ మేనమామ పెట్టిన షరతులని ఎలా సాధించాడన్నదే మిగతాకథ.

ఈ కథలో మోసపోయినవాళ్ళు దిలైలా చెప్పే కథలని యిట్టె నమ్మేస్తారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూస్తే నవ్వొస్తుంది. అలాగే ఒకదానితో ఒకటై కుదిరేలా సంఘటనలనీ, సన్నివేశాల్నీ రచయిత ఊహించిన తీరు కూడా అబ్బురపరుస్తుంది. పాత్రల పేర్లూ, శంకర్ గారి బొమ్మలూ అన్నీ అరేబియన్ నేపధ్యాన్ని మన కళ్ళకు కట్టిస్తాయి. 'అమరచిత్ర కథ' వాళ్ళది ఈనాడు పేపర్లో డైలీ కామిక్ సీరియల్ గా వచ్చిన 'చోర శిఖామణి' (ఇంగ్లిష్ లో SAHASRA MALLA) అని వచ్చిన కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. కానీ నేపథ్యం జైన జానపదం. ఇతివృత్తం ఒకటే కానీ పాత్రలూ సన్నివేశాలూ, చిత్రణ అన్నీ వేరు. అదికూడా చాలా బాగుండేది. ఈ మధ్య ఇంగ్లిష్ లో కనిపిస్తే కొన్నాను. దానిగురించి తరువాతి పోస్టులో వ్రాస్తాను.

- రాధేశ్యాం